Showing posts with label బిడ్డ లేడాయే. Show all posts
Showing posts with label బిడ్డ లేడాయే. Show all posts

Thursday, February 27, 2014

తెలంగాణ వచ్చింది.. బిడ్డ లేడాయే

Published at: 28-02-2014 04:07 AM

అమరుడు వెంకటేశం తల్లి వేదన
బతుకుపోరులో భర్త.. ఉద్యమపోరులో బిడ్డ బలి
తెలంగాణ కోసం నడిరోడ్డుపై ఆత్మహుతి
దిక్కులేనిదైన కన్నతల్లి..
ఆదుకునే వారు లేక దుర్భర జీవనం


http://www.andhrajyothy.com/node/70362

సిరిసిల్ల, ఫిబ్రవరి 27: తెలంగాణ వస్తే కష్టాలు తీరుతాయన్నాడు. బాధలు తొలగుతాయని కన్నతల్లికి భరోసా ఇచ్చాడు. తెలంగాణ రానే వచ్చింది. కానీ ఆ తల్లికి దుఃఖం మిగిలింది. కష్టాలు తీర్చుతానన్న ఒక్కగానొక్క కొడుకు కనుమరుగయ్యాడు. తెలంగాణ కోసం ఆత్మత్యాగం చేసుకుని అమరుడయ్యాడు. కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో ఆత్మాహుతికి పాల్పడిన విద్యార్థి వెంకటేశం తల్లి విజయ దీనగాథ ఇది. భర్త నర్సయ్య అనారోగ్యంతో మృతి చెందడంతో బీడీలు చుడుతూ కొడుకును చదివించింది. అతన్ని ప్రయోజకుడిని చేయాలని తపించింది. పదో తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలోనే వెంకటేశం 500పైగా మార్కులు తెచ్చుకుని అందరి మన్ననలు పొందాడు. కొడుకుపై ఎన్నో ఆశలు పెంచుకున్న విజయ.. 2010లో అతన్ని ప్రైవేట్ కాలేజీలో చేర్పించింది. అప్పటినుంచి వెంకటేశానికి పరిచయాలు పెరిగాయి. తెలంగాణ ఉద్యమం తీవ్ర స్థాయిలో ఉన్న దశలో అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం మొదలుపెట్టాడు.

తెలంగాణ మీటింగ్‌లు ఎక్కడ జరిగినా వెళ్లేవాడు. దీక్షలు జరిగితే దండలు వేసుకొని కూర్చునే వాడు. బాగా చదువుకోవాలని తల్లి చెబితే.. అంతకంటే తెలంగాణ ముఖ్యమని బదులిచ్చేవాడు. అప్పటికే వెంకటేశం తండ్రి అనారోగ్యంతో మంచాన పడ్డాడు. తల్లి బీడీలు చుడుతూ ఇంటిని పోషిస్తోంది. చిన్న రేకుల షెడ్డులో నివాసం. తెలంగాణ ధర్నాలు జరుగుతున్న సమయంలోనే 2010 డిసెంబర్‌లో భర్త చనిపోయాడు. తల్లీకొడుకులిద్దరూ మానసిక వేదనతో కుంగిపోయారు. తండ్రి మరణంతో ఇంటిపట్టునే ఉన్న వెంకటేశం టీవీకే అతుక్కుపోయాడు. తెలంగాణ వార్తలనే చూస్తూ గడిపాడు. తెలంగాణపై జరుగుతున్న పరిణామాలు, తలెత్తుతున్న అనుమానాలతో వెంకటేశం కలత చెందాడు. రాష్ట్రం వస్తుందో లేదోనని ఆందోళనకు గురయ్యాడు. 2010 డిసెంబర్ 23న ఉదయమే తెలంగాణ ధర్నా ఉందని చెప్పి బయటకు వెళ్లాడు. సిరిసిల్ల బస్టాండ్ సమీపంలోని కొత్త పెట్రోల్ బంక్ వద్ద రోడ్డుపైనే జై తెలంగాణ నినాదాలు చేస్తూ ఒంటిపై కిరోసిన్ పోసుకున్నాడు. నిప్పుకణికగా మారి కూడా తెలంగాణ నినాదాలను ఆపలేదు. స్థానికులు అతన్ని ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది.

అండగా నిలుస్తాడనుకున్న కొడుకు మృతితో విజయ గుండెలు పగిలేలా రోదించింది. ఒకే నెలలో భర్తను, బిడ్డను పోగొట్టుకొని అనాథగా మారింది. ఆమెకిక కన్నీళ్లే మిగిలాయి. మూడేళ్లుగా వారి జ్ఞాపకాల మధ్యే ఒంటరి జీవితం గడపుతోంది. 'తెలంగాణ వస్తే కష్టాలు పోతాయని చెప్పి... నన్ను కష్టాల్లోనే ఉంచి వెళ్లాడు. అమ్మా మన బాధలు తీరుతాయని చెప్పిన కొడుకు తెలంగాణ వచ్చినంక లేకుండా పాయే. తెలంగాణ రాష్ట్రంతో నా కొడుకు ఆత్మ శాంతిస్తుంది' అని తన మనసులోని బాధను 'ఆంధ్రజ్యోతి'తో పంచుకుంది. కొడుకు చనిపోయినప్పుడు అందరూ వచ్చి దండలు వేసి మేమున్నామంటూ భరోసా ఇచ్చారు. ఖర్చుల కోసం రూ. 25 వేలు ఇస్తున్నామంటూ టీఆర్ఎస్ నేతలు డబ్బులు చేతిలో పెట్టారు. కానీ లెక్క చూస్తే అవి రూ. 21 వేలే ఉన్నాయని విజయ తెలిపింది. ఆ తర్వాత ఎవరూ ఆమెను పట్టించుకోలేదు. బీడీలు చుడితేనే పూట గడిచే పరిస్థితి ఆమెది. తెలంగాణ రావడంతో తన కొడుకు ఆత్మ శాంతిస్తుంది... అది చాలంటూ సంతృప్తి పడుతోంది.

ఏ ఆసరా లేక పేదరికంలో మగ్గుతున్న వెంకటేశం తల్లికి సాయం చేయదలచిన వారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, సిరిసిల్ల బ్రాంచ్ ఖాతా నెంబర్ 62312713609, విజయ పేరిట డబ్బు జమ చేయవచ్చు. ప్రత్యక్షంగా సాయం అందించాలనుకున్నవారు.. 9618902074 నెంబర్‌లో సంప్రదించవచ్చు.

Source: ఆంధ్ర జ్యోతి