Friday, November 15, 2013

నిజాయతీపరులను ఎన్నటికీ మరువను-కె.ఆర్.వేణుగోపాల్

Published at: 15-11-2013 05:49 AM


ముగ్గురు ప్రధానులు, ఐదుగురు ముఖ్యమంత్రుల వద్ద పనిచేసిన అనుభవజ్ఞుడు. రెండు రూపాయలకు కిలో బియ్యం పథకం, అంగన్‌వాడీ వంటి కార్యక్రమాల విజయవంతానికి కృషి చేసిన ఆదర్శప్రాయుడు రిటైర్డు ఐఏఎస్ అధికారి కె.ఆర్.వేణుగోపాల్. ప్రస్తుతం 76 ఏళ్ల వయసులో కూడా మానసిక వికలాంగుల కోసం ఓ స్వచ్ఛంద సంస్థను నడిపిస్తూ.. దళిత అధ్యయన కేంద్రాన్ని నిర్వహిస్తున్న ఆయన జీవితంలో ఎదురైన సంఘటనలే ఈ వారం అనుభవం..

ప్రతి రోజూ విధుల్లో భాగంగా మేము ఎన్నో ఫైళ్లు చూస్తాం. ఫైల్ అంటే ఒట్టి కాగితం కాదు. ప్రతి ఫైలు వెనుక ఒక మనిషి, అతనికి మరో ప్రత్యర్థి ఉంటాడు. అందుకే ప్రతి ఫైలూ ఒక యుద్ధభూమే! అవి కాగితాలు కాదు జీవితాలు అనే విషయాన్ని విస్మరిస్తే ప్రజలకు ఏం మేలు చేస్తాం? ప్రతి సంతకం వెనుక ఒక సంఘర్షణ ఉంటుంది. పక్కదారి పట్టించే కుయుక్తులు, ఒత్తిళ్లు ఎదురవుతాయి. వాటన్నిటినీ ఎదిరించడానికి ధైర్యం కావాలి. ఇక్కడ ఒక మాట స్పష్టం. నిజాయితీ ఉన్న చోటే ధైర్యం.. ధైర్యం ఉన్నచోటే నిజాయితీ ఉంటాయి. ఇవి లేకపోతే.. నిష్పక్షపాతంగా వ్యవహరించలేరు.

సాధారణంగా అసిస్టెంట్ కలెక్టర్ నుంచి కలెక్టర్లయ్యాకే బదిలీలు ఉంటాయి. కానీ, అసిస్టెంట్- కలెక్టర్‌గా శిక్షణలో ఉన్నప్పుడే బదిలీకి గురైన అరుదైన వ్యక్తుల్లో నేనొకణ్ని. అసిస్టెంట్ కలెక్టర్‌ను ఎవరైనా ఎందుకండీ బదిలీ చే స్తారు. అప్పుడు మండళ్లు కాదు సమితిలు ఉండేవి. బిడిఓలుగా నెల రోజులపాటు శిక్షణ ఇచ్చి ఆ త ర్వాత కొంత కాలం ఇండిపెండెంట్ బిడిఓగా బాధ్యతలు నిర్వహించే శిక్షణ కూడా ఉంటుంది. నెల్లూరుకు 10 మైళ్ల దూరంలో వెంకటాచలం అనే బ్లాక్ హెడ్‌క్వార్టర్ ఉంది. అక్కడ రామిరెడ్డి దశరాథరామిరెడ్డి అనే ఒకాయన సమితి ప్రెసిడెంట్. అది 1964 పంచాయతీ ఎన్నికల సమయం. పని నేర్చుకుంటూ నేను, బీడీవో కలిసి తిరుగుతున్నాం. మొదట్నించీ నాకు టీచర్లంటే ఎనలేని గౌరవం. అయితే ఇక్కడ మాత్రం టీచర్లు రాజకీయాల్లో మునిగి తేలుతున్నారు. ఒక్కో టీచర్ ఒకే చోట పదీ-పదిహేనే ళ్లుగా పాతుకుపోయి ఉన్నారు. స్కూలనేది వాళ్లకో విషయమే కాదు. ఎంత సేపూ రాజకీయాలే. నేనా వివరాలన్నీ రాసి పెట్టుకున్నాను. నా శిక్షణ పూర్తయ్యింది. ఇండిపెండెంట్ చార్జ్ వచ్చేసింది. అప్పుడు జరిగిన ఎన్నికల్లో దశరథరామిరెడ్డే సమితి ప్రెసిడెంట్‌గా మళ్లీ ఎన్నికయ్యాడు. అతనికి శుభాకాంక్షలు చెప్పడానికి నేను వెళ్లలేదు. నేను ఇండిపెండెంట్ చార్జ్ తీసుకోగానే ఏకంగా వంద మంది టీచర్లను బదిలీచేశాను. అప్పట్లో అదో పెద్ద సంచలనం. తీవ్ర నిరసనలు జరిగాయి.

ఎసి సుబ్బారెడ్డి అనే ఆయన ఆ రోజుల్లో నెల్లూరులో ఏకైక నాయకుడు. ఆనం వాళ్లకి అక్కడ రాజకీయ ప్రాబల్యం ఉంది. మా సమితి ప్రెసిడెంటు ఆనం వాళ్ల గ్రూపు. దశరథ రామిరెడ్డి సుబ్బారెడ్డి వద్దకు వచ్చాడు. ఆయన ఇరిగేషన్ మినిస్టర్. ఆయనకు నాపై పలురకాల ఫిర్యాదులు చేశారు. 'వంద మంది టీచర్లను బదిలీ చేయడం అన్యాయం, దౌర్జన్యం. ఈయన్ను ఇక్కడ ఉంచితే మనకు చాలా నష్టం అందువల్ల ఇక్కడినుంచి పంపించెయ్యండ'ని చెప్పారు. ఆ మాట మేరకు సంబంధిత అధికారికి చె ప్పి నన్ను బుచ్చిరెడ్డి పాలెం అనే చోటికి బదిలీ చేయమని కలెక్టర్ గారికి ఉత్తర్వు వచ్చింది. ఇదేమిటని ప్రశ్నించకుండా కలెక్టర్ నన్ను పిలిపించి అక్కడికి వెళ్లమని చెప్పారు. ఈ సంఘటన నన్నంతగా కదిలించలేకపోయింది. నేనన్నీ సర్దుకుని బుచ్చిరెడ్డి పాలెం వెళ్లిపోయాను. విధినిర్వహణలో నిజాయితీగా ఉంటే ఎటువంటి సమస్యలు ఎదురైనా ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేవని నేను బలంగా నమ్ముతాను.

రైతులు ఇష్టపడే ఎరువులనే...
ఆ రోజుల్లో నెల్లూరు సమస్యాత్మక ప్రాంతం అనుకుంటే బుచ్చిరెడ్డి పాలెం దానికంటే వెయ్యి రెట్లు సమస్యాత్మకమైనది. అక్కడ మేనకూరు గ్రూపు, బెజవాడ గ్రూపు అని రెండు గ్రూపులు ఉండేవి. ఆ ప్రాంతంలోని ఎవరైనా ఈ రెండింటిలో ఏదో ఒక గ్రూపులో చేరాల్సిందే. నేను ఈ రెండు గ్రూపుల మధ్యన పడి నలిగిపోతానన్నది సుబ్బారెడ్డి భావన. ఆ రోజుల్లో 'మొలగొలుకులు' అనే వరిపంట పండేది. ఇది ఏడు మాసాల పంట. కాకపోతే వరికాండంలో ఉండాల్సినంత బలం లేక మొక్క బురదలోకి వంగిపోయేది. ధాన్యానికి కూడా ఉండాల్సినంత గట్టితనం ఉండేది కాదు. అందుకే వరికర్ర వంగిపోవడం, ధాన్యం రాలిపోవడం జరిగేవి. ఈ పరిస్థితి లేకుండా చేయడానికి ఎకరానికి ఒక బస్తా సూపర్ పాస్పేట్ ఎరువు వేయాలి. ఇది రైతాంగం నాకు చెప్పిన విషయం. కాకపోతే అదెప్పుడూ వారికి అందుబాటులో ఉండేది కాదు. ఆ ఎరువు తెప్పించే హామీ నాదని గట్టిగా చెప్పాను. ఈ ఎరువును 'ప్యారీ', 'షావాలెస్' అనే రెండు కంపెనీలు ఉత్పత్తి చేసేవి. అయితే షావాలెస్ కంపెనీ వాళ్ల ఎరువు రైతులకు అంత ప్రయోజనకరంగా అనిపించలేదు. అందుకే ప్యారీ ఎరువుని ఇష్టపడేవాళ్లు. అక్కడున్న రెండు బ్యాంకుల్లో ఒకటి ప్యారీ కంపెనీవి తెప్పిస్తే, మరో బ్యాంకు షావాలెస్ ఎరువులు తెప్పిస్తుంది. అక్కడా రాజకీయాలే. వర్షాలు వచ్చాయి, కాలువ వచ్చేసింది. కానీ, ఎరువులు లేవు. ఎరువుకు సంబంధించిన వ్యవహారాలు చూసే ఒక పెద్దాయన వద్దకు మా ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్‌ని పంపించాను. అతను సకాలంలో సూపర్ పాస్పేట్ అందేలా చూడమని వాళ్లకు చెప్పాడు. ఆ మాట విన్న ఆయన పకపకా నవ్వి "ఎరువులెప్పుడైనా సకాలంలో అందుతాయా? ఐఏఎస్ ఆఫీసర్ కొత్తాయన, ఆయనకు రాజకీయాలు తెలియవు. ఇవన్నీ నిజంగా జరిగే పనులా? ఆయనకు తెలియకపోతే మీకన్నా తెలియాలి కదా! అప్పుడేదో చెప్పాం. అవన్నీ సీరియస్‌గా తీసుకుంటే ఎలా? మాకు మా పార్టీ పాలిటిక్స్ ఉన్నాయి. వీళ్లంతా మా వాళ్లు కాదు కదా!'' అన్నారు.

మా ఆఫీసర్లు ఆ రాజకీయ నాయకులు విషపు మాటల గురించి నాకు చెప్పారు. నేను ఒక్క నిమిషం మౌనంగా ఉండిపోయాను. ఆ వెంటనే నేరుగా ప్యారీ కంపెనీకి ఫోన్ చేసి మాట్లాడాను. "షావాలెస్ కంపెనీ ఎరువు ఉన్నప్పటికీ మీ కంపెనీ ఎరువునే మా ప్రజలు కోరుకుంటున్నారు. అందుకని మాకు వెంటనే ఎరువు సరఫరా చేయాల''న్నాను. ఇప్పటికిప్పుడు సాధ్యం కాదన్నారు మొదట. నేను గట్టిగా "మీదింత పెద్ద కంపెనీ. రైతులకు అవసరానికి అందించలేకపోతే మీ కంపెనీకి అంత పేరెందుకు'' అన్నాను. వారు ఆలోచనలో పడ్డారు. "మీరు చెబుతున్నారు కాబట్టి ఏదో ఒకరకంగా పంపించే ఏర్పాట్లు చేస్తాం. ఎరువు రాగానే అందుకోవడానికి సిద్ధంగా ఉండాల''న్నారు. అప్పటికే మరోచోటికి పంపించిన ఎరువులను మాకు తరలించారు. విపరీతమైన వర్షాల చాలా రోడ్లు తెగిపోవడంతో వేరే దారుల్లోంచి ఎరువును చేరవేయాల్సి వచ్చింది. వందలాది లారీల్లో వచ్చిన ఆ ఎరువులను వెంటనే నిలువ చేయడానికి గోదాములు లేకపోవడం వల్ల స్కూళ్లకు సెలవులు ప్రకటించి ఆ భవనాల్లో వాటిని నిలువచేసి ఆ తర్వాత సరఫరా చేశాను. రైతును రైతుగా చూడకుండా రాజకీయ వర్గానికి చెందిన వ్యక్తిగా చూడటం ద్వారా ఎన్నో అనర్థాలే జరిగిపోతున్నాయి.

ఇన్నేళ్లలో తెలుసుకున్నది అదే...
ఆ తర్వాత సబ్ కలెక్టర్‌గా రాజమండ్రి వెళ్లిపోయాను. అప్పుడొచ్చిన తీవ్రమైన కరువు వల్ల ధాన్యసేకరణ కోసం మమ్మల్ని అవసరమైన చోట్లకు పంపించారు. మిల్లర్లు అనుసరించే కొన్ని విధానాల వల్ల ధాన్యం సేకరించడం అంత సులువైన పనికాదు. వాళ్లను నియంత్రిస్తే గానీ పనులు కావు. రాజమండ్రిలో ఎక్కడ చూసినా బియ్యంకోసం ప్రైవేట్ దుకాణాల ముందు మహిళలు బారులు తీరి నిలుచున్నారు. గోదావరి తీరప్రాంతంలో సమృద్ధిగా పంటలు పండే రాజమండ్రి ప్రాంతంలో బియ్యానికి కరువు రావడం ఏమిటి? ఇది నన్ను చాలా ఆశ్చర్యానికి గురిచేసింది. కోపం కూడా వ చ్చింది. దీనికంతటికీ కారణం మిల్లర్లు బియ్యాన్ని దాచిపెట్టడమే. వెంటనే రంగంలోకి దిగాం. రైస్ మిల్లర్లతో మీటింగ్ పెట్టాం. వెంటనే బియ్యం విడుదల చేయకపోతే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించాను. అందులో భాగంగా ఒక్కో రైస్ మిల్లుకు రాజమండ్రిలోని రెండు షాప్‌ల చొప్పున లింక్ చేశాను. వారికి మేము నిర్దేశించిన మేరకు బియ్యం సరఫరా చేయాలని ఆదేశించాను. మామూలుగా అయితే నాకు ఇలా ఆదేశించే అధికారం లేదు. కానీ, ధాన్యం విషయంలో రిక్విజేషన్ చేసే అధికారం నాకుంది. దానికింద నేను ఎవరినైనా అరెస్ట్ చేయవచ్చు. బాధ్యతారహితంగా ఉన్న ఓ ముగ్గురు మిల్లర్లను, ముగ్గురు డీలర్లను అరెస్ట్ చేశాను. 10 రోజుల్లో పరిస్థితి చక్కబడింది.

దాదాపు మూడేళ్లు అక్కడే ఉన్నాను. ఆ తరువాత పలు జిల్లాల్లో పనిచేసి హైదరాబాద్‌లోని ఎఫ్‌సిఐలో సీనియర్ రీజినల్ మేనేజర్‌గా వెళ్లాను. అక్కడ పనిచేస్తున్నప్పుడు ఒక రోజు ఒకాయన మా ఆఫీసుకు వచ్చి నన్ను చూడాలని చెప్పారట. నేను చాలా బిజీగా ఉన్నానని చెప్పినా లేదు లేదు నేను చూసే వెళ్లాలన్నారట. నెల్లూరు నుంచి వ చ్చారాయన. ఆయన ఎవరో కాదు రామిరెడ్డి దశరథ రామిరెడ్డి. "సార్! ఆరోజు నిన్ను అర్థం చేసుకోలేదు. కానీ, ఆ తర్వాత కాలం నుంచి ఈరోజు దాకా ఈ రాష్ట్రంలో ఎక్కడ పనిచేసినా, ఎలా పనిచేస్తున్నారో తెలుసుకుంటూనే ఉన్నాను. నీ నిబద్ధత గురించి అంతటా వినిపిస్తోంది. ఆ రోజు నిన్ను అర్థం చేసుకోలేకపోయినందుకు ఏళ్ల తరబడి నేనెంతో బాధపడుతున్నాను. ఈ 12 ఏళ్ల తర్వాత ఒకసారి నిన్ను చూసి ఈ విషయం నీకు చెప్పి వెళ్లిపోదామని వచ్చాను'' అంటూ వెళ్లిపోయాడు. ఎదుటి వాళ్లు ఎలా వ్యవహరించినా నీతి నిబద్ధతతో నిలిచే వారికి సమాజంలో ఎప్పుడూ ప్రేమాభిమానాలే లభిస్తాయని నా ఇన్నేళ్ల జీవితం చెప్పింది.

ప్రధాని నుంచి ఫోన్...
బాబ్రీ మసీదు విషయం బాగా రగులుతున్న సమయంలో నేను ప్రధానమంత్రి వి.పి. సింగ్ వద్ద అడిషనల్ సెక్రెటరీగా ఉన్నాను. ఆ సందర్భంలో వి. పి సింగ్ ఒక నిర్ణయానికి వచ్చారు. అదేమిటంటే, బాబ్రీ మసీదును ఆనుకుని ఉన్న భూమిని ల్యాండ్ అక్విజిషన్ చట్టం కింద తీసుకుంటే దాన్ని కేంద్ర ప్రభుత్వం కాపాడగలదని భావించారు. ఈ సందర్బంగా ఒక ఆర్డినెన్స్ తీసుకు వస్తే బావుంటుందనుకున్నారు. ఆ ఆర్డినెన్స్ ద్వారా ఆ భూమిని మన నియంత్రణలోకి తెచ్చుకుంటే, ఆ భూమిని కాపాడటంలో ఉన్న సమస్యల్ని అధిగమించవచ్చుననుకున్నారు. ఇది ప్రభుత్వపరమైన అతి పెద్ద రహస్యం. పైగా అందులోని విషయం చాలా సంక్లిష్టమైనది. అయితే వి. పి. సింగ్ గారికి నామీద నమ్మకం కారణంగా ఆ డ్రాప్ట్ రాసే పని నాకే అప్పగించాలనుకున్నాడు. రాత్రి 10 గంటల వేళ ఆ ఆర్డినెన్స్ రాయించాలనుకున్నాడు. అప్పటికి నేను ఇంటికి చేరుకున్నాననుకున్నాడు. ఇంటికి ఫోన్ చేస్తే నేను ఆఫీసులో ఉన్నట్లు వారికి సమాధానం అందింది. ఆ వెంటనే నాకు ఫోన్ చేసి 'వేణుగోపాల్ రాత్రి 10 గంటలకు ఆఫీసులో ఏంచేస్తున్నావ్?' అన్నాడు. మరుసటి రోజు ప్రధానమంత్రికి అందచేయాల్సిన కొంత పని ఉంది అది పూర్తి చేశాక ఇంటికి వెళ్లాలి. ఆమాటే ఆయనకు చెప్పాను. కొద్ది క్షణాల తరువాత 'వెంటనే వచ్చి నన్ను కలవగలవా?' అన్నాడు.
నేను ఆయన ఇంటికి వెళ్లినపుడు సుబోద్ ఖాన్ సహాయ్ ఆయన వద్దే ఉన్నారు. నేను వెళ్లగానే 'వేణుగోపాల్! ఎంత రాత్రి వరకు నువ్వు మేల్కొని పనిచేయగలవు?'అంటూ ప్రశ్నించాడు. నాకు ఆశ్చర్యం వేసింది. 'ఏకంగా రెండు రాత్రుల దాకా మేలుకుని పనిచేయగలను. ఏం చేయాలో చెప్పండి' అన్నాను. 'వేణుగోపాల్! ఇది చాలా పెద్ద రహస్యం. నా మనసు నీకు తెలుసు కాబట్టి. నువ్వే దీన్ని సరిగ్గా రాయగలవు' అన్నాడు. ఈ ఆర్డినెన్స్ రాత్రికి రాసి రాష్ట్రపతికి పంపించాలన్నారు. ఆ సబ్జెక్ట్ నాకు సంబంధించింది కాదు. ఆ విషయం వి. పి. సింగ్ గారికి కూడా తెలుసు. అయినా ఆ డ్రాప్టు నన్నే రాయమన్నారు. అంతేకాకుండా అందులో పాల్గొనాల్సిన అందరినీ ఉదయం ఆరు గంటలకే సమావేశ పరచాల్సిన పనిని కూడా నాకే అప్పగించారు. అవన్నీ పూర్తయ్యాయి. కానీ, కొన్ని కారణాల వల్ల ఆ ఆర్డినెన్స్ విడుదల కాలేదు.
ం బమ్మెర

Source: Andhra Jyothi


No comments: