Monday, November 04, 2013

తొలి తెలుగు శాసనం లేనట్లే

Published at: 05-11-2013 07:37 AM




ఇంజనీరింగ్,ఎంబీబీఎస్‌లోనూ తెలుగు బోధన
మండలి బుద్ధ ప్రసాద్

చెన్నై, నవంబర్ 4: తొలి తెలుగు శాసనం దాదాపుగా కనుమరుగైపోయినట్లేనని ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం చైర్మన్ మండలి బుద్ధప్రసాద్ పేర్కొన్నారు. ఎన్నో తెలుగు తాళపత్ర గ్రంథాలకు నెలవైన తంజావూరులోని సరస్వతీ మహల్ లైబ్రరీ పరిశీలనకు వెళ్తున్న మండలి సోమవారం చెన్నైలో 'ఆంధ్రజ్యోతి'తో మాట్లాడుతూ... "కలమళ్ల శాసనం అసలు రికార్డుల్లోనే లేదు. చెన్నై మ్యూజియానికి చేరినట్లుగా ఎలాంటి ఆధారాలు లేవు. ఎక్కడెక్కడో వుందని పరిశోధకులు చెబుతున్నారు. వారు చెప్పిన చోటల్లా వెతుకుతున్నాం. కానీ అది అలభ్యం. అందువల్ల అది కనుమరుగైపోయినట్లేనని భావిస్తున్నా. అయితే ఆ శాసనం ప్రతిని స్కాన్ చేసి, గూగుల్లో పెట్టి అన్వేషిస్తే అది ఎక్కడ వున్నా కనిపెట్టగలమని ఇటీవల సెంట్రల్ యూనివర్శిటీ వారు చెప్పారు. ఆ పనులు కూడా జరుగుతున్నాయి. బహుశా ఇదే ఆఖరి ప్రయత్నమేమో! అదే కాలానికి చెందిన తెలుగులో 2వదిగా చెప్పబడుతున్న శాసనం మాత్రం చెన్నై మ్యూజియంలో వుంది. కానీ తొలి శాసనం లేదు. అందువల్ల అది ఇక్కడికి చేరలేదని భావిస్తున్నాం. ఇలాంటి శాసనాలు ఎన్నో కనుమరుగైపోయాయి. అయితే ఆ శాసనం దొరకనిపక్షంలో దాని ప్రతిని ఆధారంగా చేసుకుని అలాంటిదే మళ్లీ చెక్కించి, కలమళ్లలో స్థాపించాలన్న ఆలోచన కూడా వుంది'' అని పేర్కొన్నారు. తెలుగు జాతి వైఫల్యం వల్లే తొలి శాసనం కనుమరుగైపోయిందన్నారు.

Source: Andhra Jyothi

No comments: